మహేశ్ పక్కన ఆ హీరోయిన్.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా

0

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్ట్ గురించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఎంపికైనట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా, తన కొత్త ప్రాజెక్ట్‌ సక్సెస్ కావాలి అని చిలుకూరు బాలాజీని దర్శించుకుంది. ఈ సందర్బంగా దేవుని ఆశీస్సులతో తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.

ప్రియాంక ఈ విషయాన్ని ప్రకటించడమే కాకుండా, హైదరాబాద్‌లో తనకు సహకారం అందించిన ఉపాసనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది. దీనికి స్పందించిన ఉపాసన కూడా ఆమె కొత్త సినిమా భారీ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ రిప్లై ఇచ్చారు. వీరి మధ్య జరిగిన ఈ పరస్పర సంభాషణతో, ప్రియాంక చోప్రా మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అయ్యిందనే విషయాన్ని చాలా మంది పరోక్షంగా నిర్ధారించారు.

అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయని వార్తలు వచ్చినప్పటికీ, రాజమౌళి ఆ విషయంపై ఏమీ స్పందించలేదు. దాంతో ప్రేక్షకులు ఈ భారీ ప్రాజెక్ట్ గురించి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రియాంక చోప్రా వంటి అంతర్జాతీయ స్థాయి నటి మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే, ఈ సినిమా కోసం రాజమౌళి ప్రపంచ స్థాయి కంటెంట్‌తో అద్భుతమైన కథను సిద్ధం చేసినట్టు సమాచారం. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమా అభిమానులందరికీ ఇది ఒక భారీ ట్రీట్ అవుతుందనడంలో సందేహం లేదు.

ప్రియాంక చోప్రా ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్. తెలుగు సినిమా ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కావడం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్టను పెంచుతుంది. మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా వంటి భారీ పేర్లు కలిసే ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.