హిందీ మార్కెట్‌లో సత్తా చూపి.. తెలుగులో మాత్రం ఆవేదన మిగిలిచిన పుష్ప 2

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై, హిందీ మార్కెట్‌లో సెన్సేషనల్ విజయాన్ని సాధించినప్పటికీ, తెలుగులో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. సినిమా విడుదల తర్వాత సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసుతో బన్నీ ప్రమోషన్లపై దృష్టి పెట్టలేకపోవడం, పోస్ట్-రిలీజ్ ప్రమోషన్లలో లోటు పడటం వసూళ్లపై ప్రభావం చూపిందనే చెప్పాలి.

హిందీ బెల్ట్‌లో ఈ చిత్రం డబుల్, ట్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘పుష్ప-2’ని నిజమైన హిట్‌గా చెప్పటం కష్టం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కును చేరుకోలేదు. కేవలం రాయలసీమలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యింది. నైజాంలో ఈ చిత్రం నిరాశజనక ప్రదర్శనతో ట్రేడ్ వర్గాలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.

దక్షిణాదిన ఇతర రాష్ట్రాల్లోనూ ‘పుష్ప-2’ నిరాశపరిచిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. కేరళలో ఈ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలవగా, తమిళనాడులో యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. కర్ణాటకలో మాత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, యుఎస్‌లో తెలుగు వెర్షన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 8 మిలియన్ డాలర్ల వద్ద ఫుల్ రన్ ముగియగా, ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ మాత్రం 13 మిలియన్ డాలర్ల వసూళ్లతో రికార్డులు సృష్టించడం విశేషం.

క్రిస్మస్ వీకెండ్‌ను ‘పుష్ప-2’ తెలుగులో పూర్తిగా ఉపయోగించుకోలేకపోవడం గమనార్హం. హిందీ వెర్షన్ సూపర్ స్ట్రాంగ్ రన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా, బయ్యర్లు స్వల్ప నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. మొత్తానికి, ‘పుష్ప-2’ హిందీ మార్కెట్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన సినిమా అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి నైజాంలో జరిగిన ఈ పరాజయం, తదుపరి చిత్రాలకు పాఠాలుగా నిలవాల్సి ఉంది.