రూట్ మార్చిన రవితేజ .. ఆసక్తి పెంచుతున్న లైనప్

0

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ‘ఇరుముడి’ ఒక కీలకమైన మలుపుగా మారినట్లు కనిపిస్తోంది. కొంతకాలంగా వరుసగా మాస్, యాక్షన్ కథలను ఎంచుకున్నా వాటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణతో కలిసి కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న కథను చేయడం కొత్త ప్రయత్నంగా నిలిచింది. సినిమాకు వస్తున్న స్పందనను చూస్తుంటే రవితేజ చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులకు నచ్చినట్లే అనిపిస్తోంది.

అయితే ‘ఇరుముడి’తో వచ్చిన ఫలితాన్ని కొనసాగిస్తూ అదే తరహా కథలను ఎంచుకోవడం రవితేజ ఉద్దేశంగా కనిపించడం లేదు. ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా విభిన్నమైన ఎంపికలే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయనున్న దర్శకుల జాబితాలో హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ పేర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ సాధారణ కమర్షియల్ ఫార్ములాను మాత్రమే నమ్ముకుని సినిమాలు చేసే దర్శకులు కాదు. కథలో కొత్తదనం, పాత్రలకు ప్రత్యేకత, వినోదాన్ని భిన్నంగా చూపించడం వీరి సినిమాల్లో కనిపించే అంశాలు. దీంతో రవితేజ కొత్త ప్రాజెక్టులపై ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడుతోంది.

హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ముందుగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ సినిమాలతో తనదైన శైలిని చూపించిన హసిత్.. ఈసారి రవితేజతో పాటు శ్రీవిష్ణును కూడా కథలో భాగం చేస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రవితేజ, శ్రీవిష్ణు కలిసి నటించడం ఈ ప్రాజెక్టుకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఇద్దరికీ కామెడీపై మంచి పట్టు ఉన్నప్పటికీ వారి నటనా శైలి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే శ్రీవిష్ణుతో రెండు సినిమాలు చేసిన హసిత్ గోలి.. ఇప్పుడు రవితేజ ఎనర్జీని తన కథకు ఎలా ఉపయోగించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు హీరోల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.

ఇక వివేక్ ఆత్రేయతో రవితేజ చేయనున్న సినిమా కూడా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుగా నిలవనుంది. తొలుత ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా నిర్మాత విషయంలో మార్పు జరిగిందని, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కథ, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

మొత్తంగా చూస్తే ‘ఇరుముడి’ తర్వాత రవితేజ ఒకే తరహా సినిమాలపై ఆధారపడకుండా కొత్త కాంబినేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రయోగాలు ఆయన కెరీర్‌కు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో రాబోయే సినిమాలు నిర్ణయించనున్నాయి.