మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు ప్రత్యేకమైన పండుగే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సోషల్ మీడియాలో ఉదయం నుంచే చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, వివిధ రంగాలకు చెందిన వారు తమ అభిమాన నటుడికి ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. హైదరాబాద్లోని చిరంజీవి నివాసం వద్ద కూడా అభిమానుల సందడి కనిపించింది. తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా చూసి శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.
అయితే ఈసారి అక్కడ మరో ప్రత్యేకమైన సంఘటన చోటుచేసుకుంది. చిరంజీవిని కలిసేందుకు వచ్చిన అభిమానులను మెగా పవర్స్టార్ రామ్ చరణ్ స్వయంగా పలకరించారు. ఇంటి వద్దకు వచ్చిన ఫ్యాన్స్ వైపు వెళ్లిన చరణ్ వారిని అభివాదం చేశారు. అనంతరం కారులో నుంచి రూఫ్టాప్ ద్వారా అభిమానులకు చేతులు ఊపుతూ పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఊహించని విధంగా చరణ్ కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇటీవలే రామ్ చరణ్ శస్త్రచికిత్స చేయించుకోవడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచనల మేరకు ఎక్కువగా బయటకు రాకుండా రెస్ట్లో ఉన్నప్పటికీ తండ్రి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులను పలకరించేందుకు బయటకు రావడం మెగా ఫ్యాన్స్కు మరింత ఆనందాన్ని ఇచ్చింది. చరణ్ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా తమకు దక్కిందని పలువురు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు రామ్ చరణ్ సినిమాలపై కూడా ఆసక్తి నెలకొంది. ‘పెద్ది’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సుకుమార్తో చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో ‘రంగస్థలం’ వంటి ఘన విజయం అందింది. చరణ్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన ఈ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకరవర ప్రసాద్ గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు, ప్రస్తుతం ‘విశ్వంభర’పై కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ సినిమా విడుదలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇక చిరంజీవి పుట్టినరోజున మరో ముఖ్యమైన ప్రకటన వచ్చింది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్ను ప్రకటించడంతో పాటు టైటిల్ గ్లిమ్స్ను విడుదల చేశారు. గతంలో బాబీతో ‘వాల్తేరు వీరయ్య’ చేసిన చిరంజీవి మరోసారి ఆయన దర్శకత్వంలో నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సంక్రాంతి 2027 సందర్భంగా జనవరి 13న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చిరంజీవి ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా చిరు పుట్టినరోజు మెగా అభిమానులకు సినిమాల ప్రకటనలతో పాటు చరణ్ సర్ప్రైజ్తో మరింత ప్రత్యేకంగా మారింది.

