
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతోందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం వేసవిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే కథ ఫైనల్ కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనులు ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లు బయటకు వచ్చాయి. సంగీత దర్శకుడు భీమ్స్ ఇప్పటికే నాలుగు పాటల కంపోజింగ్ పూర్తి చేశారని సమాచారం. పాటల రికార్డింగ్, సాహిత్యం విషయాల్లో కూడా మరింత పురోగతి ఉంది. అలాగే, నటీనటుల ఎంపిక పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. చిరంజీవి గత కొన్ని సినిమాల్లో మాస్, యాక్షన్ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే, ఈసారి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. చిరంజీవి తాజా చిత్రంలో ఆయన కామెడీ టైమింగ్కి సరిపోయే నటీనటుల్ని ఎంచుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
అనీల్ రావిపూడి సినిమాలకు మంచి కమర్షియల్ హిట్ రికార్డ్ ఉంది. తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలను సాధించే విధంగా సినిమాలు రూపొందించడంలో ఆయన ప్రత్యేకమైన శైలి ఉంది. భారీ బడ్జెట్ పెట్టి, ఎక్కువ ఖర్చు చేసే సినిమాల కన్నా, తక్కువ ఖర్చుతోనే ఆదరణ పొందే సినిమాలను రూపొందించడంలో అనీల్ స్ట్రాటజీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా అదే విధానం పాటిస్తున్నారు. అనవసర ఖర్చులు లేకుండా ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ సినిమాను సాహు గారపాటి నిర్మించబోతున్నారు. నిర్మాత కూడా అనీల్కు పూర్తిగా స్వేచ్ఛను కల్పించారని తెలుస్తోంది. ఇది అనీల్కు మరింత స్వేచ్ఛగా, తనదైన శైలిలో సినిమాను రూపొందించేందుకు సహాయపడుతుంది. చిరంజీవి కూడా స్క్రిప్ట్పై పూర్తి సంతృప్తిగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్పై అంచనాలు మరింతగా పెరిగాయి. మాస్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్ను ఆకట్టుకునేలా, వినోదానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సినిమా రూపొందించేందుకు టీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది.
వేసవిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో చిరంజీవి చేసిన కామెడీ జానర్ సినిమాలు బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న నేపథ్యంలో, ఈసారి కూడా చిరు టైమింగ్, అనీల్ కామెడీ మాస్ మాస్లకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని భావిస్తున్నారు. చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబినేషన్ ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే.