అసభ్యకరమైన కంటెంట్‌కి చెక్ – ఓటీటీలకు కేంద్రం కఠిన హెచ్చరిక!

0

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వెబ్ సిరీస్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌పై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం”లోని బాలనటుడు “బుల్లిరాజు” పాత్ర ఆసక్తికరంగా మారింది. సినిమాలో అతడి చేసే వ్యాఖ్యలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, అతని తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. “మావాడు ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చూసి పాడైపోయాడు!” అనే డైలాగ్ ప్రజల్లో విస్తృత చర్చకు దారి తీసింది.

ఇలాంటి సందర్భాల్లో ఓటీటీ కంటెంట్‌పై వచ్చిన విమర్శలు మరింత బలపడ్డాయి. ముఖ్యంగా, ఈ మాధ్యమాల్లో ఫిల్టరింగ్ లేకుండా అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంటెంట్‌లో బీప్స్ కూడా లేకపోవడం, ఏ విధమైన నియంత్రణ లేకుండా “ఏ” రేటెడ్ సిరీస్‌లు ప్రసారం అవ్వడం వివాదానికి దారితీసింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కీలక హెచ్చరికలు జారీ చేసింది. 2021 ఐటీ నియమాలను పాటించాలని స్పష్టంగా తెలిపింది. ముఖ్యంగా, పిల్లలు అనుచితమైన కంటెంట్‌ను చూడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నియంత్రణ విధించాలని సూచించింది. ఓటీటీలు స్వీయ నియంత్రణను పాటించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.

ఇటీవల ఓ స్టాండ్ అప్ కామెడీ షోలో పాడ్‌కాస్టర్ రణవీర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదానికి దారితీయగా, ప్రభుత్వం దీన్ని తొలగించాలని ఆదేశించింది. కానీ ఆ కంటెంట్ యూట్యూబ్‌లో ఉండటమే కాకుండా, ప్రజల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఈ తరహా ఘటనలే ప్రభుత్వాన్ని మరింత కఠిన చర్యలు తీసుకునేలా చేస్తున్నాయి.

తాజాగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ, సోషల్ మీడియా ప్రచురణకర్తలకు కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో, చట్టానికి విరుద్ధమైన ఏ కంటెంట్‌ను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వయస్సు ఆధారిత కంటెంట్ వర్గీకరణ విధించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అనైతిక విలువలకు విరుద్ధంగా ఏదైనా కంటెంట్ ఉంటే, సంబంధిత ఓటీటీ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

సమాజంలోని అన్ని వర్గాల నుంచి ఓటీటీలపై పెరుగుతున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు మాత్రమే కాకుండా, సోషల్ మీడియా మాధ్యమాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయని, ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్‌పై కఠిన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో, ఓటీటీలు తమ కంటెంట్‌ను మరింత జాగ్రత్తగా నియంత్రించాల్సిన అవసరం వచ్చింది. అభ్యంతరకరమైన అంశాలను తొలగించి, వయస్సు పరిమితుల మేరకు కంటెంట్‌ను వర్గీకరించడం తప్పనిసరి అవుతోంది. ప్రభుత్వ సూచనలను పాటించకుంటే, భవిష్యత్తులో మరింత కఠిన ఆంక్షలు విధించబడే అవకాశం ఉంది.