గుంటూరు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకు సంబంధించిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తనపై వస్తున్న హత్య సుపారీ ఆరోపణలను వైసీపీ నాయకుడు నరేంద్రరెడ్డి ఖండించారు. తనకు ఎలాంటి హత్య కుట్రతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. రాజకీయ కక్షతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
శ్రీనివాస్ యాదవ్ను హత్య చేసేందుకు నరేంద్రరెడ్డి ఓ రౌడీషీటర్తో రూ.కోటి సుపారీ మాట్లాడినట్లు సోమవారం ప్రచారం జరిగింది. అంతేకాకుండా సంబంధిత వ్యక్తి శ్రీనివాస్ యాదవ్ కదలికలపై రెక్కీ నిర్వహించాడనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ వార్తలు గుంటూరు నుంచి రాష్ట్ర రాజకీయ వర్గాల వరకు చర్చకు దారితీశాయి. జనసేన నాయకులు పోలీసులను ఆశ్రయించడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, కేసు నమోదు అయినట్లు సమాచారం.
అయితే తనపై వచ్చిన ఆరోపణలకు నరేంద్రరెడ్డి సెల్ఫీ వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. రూ.కోటి సుపారీ ఇచ్చాననేది పూర్తిగా అవాస్తవమని అన్నారు. అంత డబ్బు తన వద్ద ఉంటే తన పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటానని, ఎవరో ఒకరిని చంపేందుకు ఆ మొత్తాన్ని ఎందుకు ఖర్చు చేస్తానని ప్రశ్నించారు. తనను కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు.
తనకు, శ్రీనివాస్ యాదవ్కు గత కొంతకాలంగా వివాదాలు ఉన్నాయని నరేంద్రరెడ్డి చెప్పుకొచ్చారు. 2024 డిసెంబర్లో తన బార్లో మద్యం సేవించిన కొందరు బిల్లు చెల్లించకుండా వెళ్లారని, డబ్బు అడిగిన సమయంలో వివాదం ఏర్పడిందని ఆయన ఆరోపించారు. అనంతరం గత ఏడాది దీపావళి సందర్భంగా తన కుమార్తెపై కొందరు బాంబులు వేసినట్లు కూడా వీడియోలో పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించినందుకు తనపై దాడి జరిగిందని ఆరోపించారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టిలో పడేందుకు తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని నరేంద్రరెడ్డి ఆరోపించారు. తన బార్ను కూల్చివేశారని, అదే ప్రాంతంలో ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణం నిర్వహిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలకు సంబంధించి తన వీడియోలో గతంలో జరిగిన కొన్ని ఘటనల దృశ్యాలను చూపించారు.
ఈ పరిణామాలతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు జనసేన నేతపై హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణలు ఉండగా, మరోవైపు తనకు ఆ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని నరేంద్రరెడ్డి చెబుతున్నారు. ఇద్దరి మధ్య గతంలో వ్యక్తిగత, వ్యాపార సంబంధిత వివాదాలు ఉన్నాయన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే అసలు విషయం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య దర్యాప్తు ఏ దిశగా సాగుతుందన్నదే ఇప్పుడు గుంటూరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

