
పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ తెచ్చిన సంతోషంతో పాటు, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గంలోకి అడుగుపెట్టడంతో టెన్షన్ కూడా వచ్చింది.
శనివారం ఉదయం ఆయన రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి భారీ ఊరేగింపుతో భీమవరంలోని పెదమీరం ప్రాంతంలో గల తన ఇంటికి చేరుకున్నారు.
రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన ఆయనకు స్వాగతం పలకటానికి అటు ఆయన అభిమానులతో పాటు, తెలుగుదేశం, జనసేనలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం విశేషం.
ప్రముఖ పారిశ్రామిక వేత్తగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ, సినీ రంగాలకు చెందిన వ్యక్తులకు సుపరిచితులు. 2013లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
అనంతరం ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్ధం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్ధం కూడా పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ ఆయన తన మాతృపార్టీ వైసీపీలోకి వచ్చారు.
ఆ పార్టీ తరపున నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్తో పొడచూపిన విభేదాల కారణంగా అరెస్ట్ అయి, చావుదెబ్బలు తిని ఎలాగొలా భయటపడ్డారు.
అనంతరం అధికారపార్టీ అధ్యక్షుడు తనపై కక్షగట్టడంతో హైదరాబాద్కు, ఆ తర్వాత ఢల్లీికి పరిమితం అయ్యారు.
మధ్యలు పలుమార్లు స్వంత నియోజకవర్గానికి రావాలని చూసినప్పటికీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాలేక పోయారు.
తాజాగా కోర్టు పర్మిషన్ తీసుకుని శనివారం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జరిగిన ఊరేగింపులో ఆయన మీడియాతో మాట్లాడుతూ…
ఇంత కాలానికి నా నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అరెస్ట్ అయినప్పుడు అండగా నిలిచిన చంద్రబాబు గారికి,
పవన్ కల్యాణ్ గారికి, నాపై కక్షపూరిగా వ్యవహరించడం వల్ల నాకు ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టిన జగన్కు అర్హత లేకపోయినా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
ఓ వైపు కోర్టు అండతో నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పటికీ ఏక్షణాన ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందోననే టెన్షన్ రఘరామ అభిమానుల్లోను, భీమవరంలోను నెలకొంది.