వెల్లంపల్లి గారూ మీరెంత వెధవౌతారో తెలుసా: క్షత్రియ సంఘాలు

0
438

బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా పెదాలుదాటే ప్రతి మాటనూ ఆచి తూచి జారడం ఒకప్పటి మాట. కానీ నోటికి ఏది వస్తే అది.. తన స్థాయిని మరిచి.. అవతల వారి స్థాయి పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య బాగా ఎక్కువైంది. బహుశా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలుగు రాజకీయాల్లో తెచ్చిన ఓ దురదృష్టకరమైన మార్పు ఇది. చాలా మంది నేతలు ఇలా నోటికొచ్చినట్ల పరుష పదజాం వాడేవారు ఉన్నా.. కేసీఆర్‌ ఈ సంస్కృతిని మరింతగా వ్యాప్తి చేశారు.

కేసీఆర్‌ నోరు విప్పితే అవతలి వారు ప్రధాని కాని.. మరెవరైనా కానీ ఏక వచనం… పరుష పదజాం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు, మంత్రులు ప్రస్తుతం ఈ బాటలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో మంత్రి కొడాలి నానిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన నోరు తెరిస్తే స్వంత పార్టీ వారే ఏం ఖర్మరా ఇది అని తల బాదుకోవాల్సిందే. అది ఆయన స్వభావం. ఆయన రూట్‌లోని మరికొందరు నేతలు తయారవుతున్నారు. తాజాగా దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ రామతీర్ధం ఘటనలో మాజీ కేంద్ర మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన రాజవంశీయులు అశోక్‌ గజపతిరాజును ‘వెధవ’ అనడం కాకరేపుతోంది.

మంత్రిగారు తన స్థాయిని మరిచి చేసిన ఈ కామెంట్స్‌కు వైసీపీ వర్గాలే సిగ్గుపడుతున్నాయి. అశోక్‌ గజపతిరాజు టీడీపీ నాయకుడు అనేది పక్కన పెడితే ఆయన ఓ రాజవంశీయుడు. ఆయన పూర్వీకులు ప్రజల కోసం వేల ఎకరాలను దానం చేశారు. శతాబ్దం క్రితమే లక్షలు వెచ్చింది ఉత్తరాంధ్ర ప్రజల జీవన స్థితి గతలు, ప్రమాణాలు పెంచానే ఉద్దేశ్యంతో విద్యాలయాలు స్థాపించారు. చేతికి ఎముక లేదన్నట్లుగా వారి కుటుంబీకులు చేసిన దాన, ధర్మాల గురించి ఇప్పటికీ కథలు కథులుగా చెప్పుకుంటారు.

అశోక్ గజపతిరాజును తెలుగుదేశం నేతగాకన్నా.. రాజవంశీయుడిగానే ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తిస్తారు. పైగా నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కూడా కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఆయన ధర్మకర్తగా ఉన్న గుడిలో జరిగిన విధ్వంసకర ఘటనను ఆపలేని వెధవ అంటూ మంత్రి వెల్లంపల్లి కామెంట్‌ చేయడం నిజంగా దురదృష్టకరం. అశోక్‌ గజపతిరాజు స్థాయితో పోలిస్తే.. వెల్లంపల్లి ఓ ఇసుక రేణువు అని అంటున్నారు. కేవలం తన ఆధీనంలోని ఒక్క గుడిలో జరిగిన ఘటనకు ఆయన వెధవ అయితే, దేవాదాయ శాఖామంత్రిగా వెల్లంపల్లి ఉండగా వందకు పైగానే గుళ్లల్లో ఇటువంటి ఘటనలు జరిగాయని చెబుతున్నారు.

వీటిలో ఓ 10 ఘటనలు అయితే సంచలనం కలిగించాయని, మరి ఇన్ని ఘటనలకు బాధ్యుడిగా ఆయన ఎంత వెధవౌతారో ఒక్కసారి ఆలోచించుకోవాలుని క్షత్రియ సంఘాలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి. సహచర మంత్రి కొడాలి నానిలాగా తాను కూడా చిత్తం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని వెల్లంపల్లికి అర్ధమౌతుందో లేదో మరి. ఏది ఏమైనా ఆంధ్రా రాజకీయాలు గుళ్ళు గోపురాలతో ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇవి తొందరగానే తగ్గిపోతాయని ఆశిద్దాం. దీనిపై ముఖ్యమంత్రి గారు స్పందిస్తే గానీ ముగింపు పలకవని కొందరు భావిస్తున్నారు.