జగన్‌ను భయపెట్టిన కాంగ్రెస్‌.. ఇది నిజం

0
272
ap cm jagan and revanth reddy

అధికారం తెచ్చిన ఆత్మవిశ్వాసం అతి విశ్వాసంగా మారితే అది చేసే చేటు అంతా.. ఇంతా కాదు. అది గ్రహించే లోపే మనకు తెలియకుండానే రోజు రోజుకీ రాజకీయంగా సన్నగిల్లుతుంటాము.

ఇలా 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లతో అద్భుతమైన విజయం సాధించిన వైసీపీ అధినేత మంచి పాలనతో ప్రజల మనసులతో పాటు, ప్రతిపక్షాల అభిమానులు, సానుభూతిపరులు, నాయకుల మనసులు కూడా గెలుచుకుని ఆ విజయాన్ని సుస్థిరం చేసుకోవాల్సింది పోయి, ప్రతిపక్షాలపై దాడులు, ఆ నేతలపై కేసులు, ప్రజా ఉద్యమాలను, ప్రశ్నించే గొంతులను కేసుల పేరుతో అణిచేయాలని చూడటం వంటి మార్గాలను ఎంచుకున్నారు.

ఈ ధైర్యంతోనే వైనాట్‌ 175 అంటూ మితిమీరిన విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రతిపక్షాలు నథింగ్‌.. చంద్రబాబు నథింగ్‌, మన పోరాటం కేవలం మీడియాతోనే అన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఆయన్ను టెన్షన్‌ పెడతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ys jagan

కాంగ్రెస్‌ పార్టీ నుంచి వేరుపడి స్వంత పార్టీని పెట్టుకుని, కాంగ్రెస్‌ క్యాడర్‌ను దాదాపు ఖాళీ చేసిన జగన్‌పై రాజకీయ పగతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ పార్టీకి ఇప్పుడు షర్మిల రూపంలో మంచి ఆయుధం దొరికింది.

దీంతో జగన్‌కు తమ సత్తా చూపించాలని డిసైడ్‌ అయిన కాంగ్రెస్‌ అధిష్ఠానం షర్మిల అనే ఆయుధంతో జగన్‌ను ఎదురు నిలిచింది. ఎదురు నిలవడమే కాదు.. జగన్‌కు భయపెట్టింది కూడా. ఇందుకు ఉదాహరణగా మొన్న జరిగిన బహిరంగ సభలో జగన్‌ ‘‘కాంగ్రెస్‌ పార్టీ నా కుటుంబాన్ని చీల్చింది. నీచ రాజకీయాలు చేస్తోంది.

మా పార్టీ పోరాటం తెలుగుదేశం, జనసేన కూటమితోనే’’ అనటం, స్వంత చెల్లిని తెలుగుదేశం పార్టీ మనిషిగా చేర్చి మరో స్టార్‌ క్యాంపెయినర్‌ దిగింది అనడం.. నిన్నటికి నిన్న తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ‘‘నేను చేయాల్సినంత.. చేయగలిగినంత చేశా.

ఇప్పటికిప్పుడైనా హ్యాపీగా దిగిపోతా’’ అంటూ నైరాశ్యంలో మాట్లాడటం వంటి విషయాలను నిశితంగా గమనిస్తే కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ మెల్లగా తిరిగి పుంజుకుంటుందనే భావన జగన్‌ను భయపెట్టిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

మరోవైపు షర్మిళ కాంగ్రెస్‌ నాయకురాలి హోదాలో చేస్తున్న వ్యాఖ్యలు, వేస్తున్న ప్రశ్నలు వైసీపీని ఇబ్బంది పెడుతున్నట్లు స్పష్టంగా అర్ధమౌతోంది. మొత్తానికి కాంగ్రెస్‌కు పగ తీర్చుకునే అవకాశం పదేళ్లకు దొరికిందన్నమాట.