పవన్‌, లోకేష్‌లు ఎక్కడ?

0
176
pawan kalyan

ఓవైపు సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తలను బట్టి ఏప్రిల్‌ నెలలో ఏపీలో లోక్‌సభకు, అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి చివరిలో గానీ, మార్చి తొలి వారంలో గానీ ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉంది.

2019లో జరిగిన ఎన్నికల్లో ఏప్రియల్‌లో తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఈసారి కూడా ఇదే జరిగే అవకాశం ఉంది.

మరోవైపు ఎన్నికల వేడి రాజుకోవడంతో వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు తమ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అయితే ఓవైపు చంద్రబాబు నాయుడు రా.. కదలిరా పేరుతో ప్రతి రోజూ దాదాపు 2 చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రజల్లోకి దూసుకు పోతున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను ఫైనల్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రజల్లోకి రావాలనేది ఆయన ప్లాన్‌. ఇంకో వైపు తాజాగా ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన షర్మిళ వరుసగా వివిధా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

అయితే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌లు మాత్రం ప్రజల్లోకి పూర్తి స్థాయిలో రాకపోవడం వెనుక కారణాలు ఏమిటో తెలియడం లేదు.

pawan kalyan

మొన్నటి వరకూ యువగళం పాదయాత్ర నిర్వహించిన లోకేష్‌ ఎన్నికల వేడికి బాగా రాజుకున్న ఈ తరుణంలో ప్రజల్లోకి రావాలని ఆ పార్టీ కేడర్‌ కోరుతున్నారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ కూడా ఆమధ్య వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఆ తర్వాత ఆయన వారాహిని యాత్రను పక్కన పెట్టేశారు. గత నెలలో కాకినాడ వేదికగా 3 రోజుల పాటు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

అయితే ఇక కీలక సమయం ఆసన్నమైనందున పవన్‌ కూడా ప్రజా క్షేత్రంలోకి వచ్చి కూటమి తరపున ప్రచారం మొదలు పెడితే పరిస్థితి నెక్ట్స్‌ లెవల్‌కు చేరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

పొత్తులకు సంబంధించి సీట్ల విషయం కూడా చంద్రబాబు, పవన్‌ల మధ్య దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక కూటమి తరపున ప్రచారం మొదలుపెట్టడం మాత్రమే మిగిలి ఉంది.

వీలైనంత త్వరగా పవన్‌ కూడా ప్రచార రంగంలోకి దూకితే కూటమి విజయావకాశాలు మరింత మెరుగు పడతాయని టీడీపీ, జనసేన కేడర్‌ కోరుకుంటున్నారు.