చైనా లో భారీ భూకంపం.. వందల మంది మృతి

0
266
china earthquake

చైనాలో సోమవారం (డిసెంబర్‌ 18) అర్ధరాత్రి దాటాక భారీ భూకంపం కారణంగా 111 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఎత్తైన భవనాలు మొత్తం నేలకూలాయి. చైనాలోని రెండు ప్రావిన్స్‌లలో భూకంపం వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థ గ్జిన్హువా న్యూస్‌ మీడియా తెలిపింది.

ఈ దుర్ఘటనలో గన్సు ప్రావిన్స్‌లో 100 మంది, పొరుగున ఉన్న కింగ్‌హై ప్రావిన్స్‌లో మరో 11 మంది మరణించినట్లు నివేదించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని మీడియా ద్వారా తెలుస్తుంది. భూకంపం దాటికి భయపడి చాలా మంది రోడ్ల మీదకి పరుగులు తీశారు.

ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కూల్‌పై 6.1గా నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) పేర్కొంది. భూకంపం 35 కి.మీ (21.75 మైళ్లు) లోతులో ఉందని, దాని కేంద్రం లాన్‌జౌ, చైనాకు పశ్చిమ-నైరుతి దిశలో 102 కిమీ దూరంలో ఉన్నట్లు EMSC తెలిపింది.

china earthquake

దీంతో చైనా జాతీయ కమిషన్, అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ సహాయక చర్యలకు ఉపక్రమించింది. సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి.

నేలకూలిన భవనాలు మరియు క్షతగాత్రుల మృతదేహాలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.ఈ దృశ్యాలను చూస్తూ ఉంటే కన్నీళ్లు రాక మానదు. కొన్ని స్థానిక గ్రామాలలో విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడింది.

మరోపక్క గడ్డకట్టే చలిలో ఎమర్జెన్సీ వాహనాలు సహాయా చర్యల కోసం తిరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా చైనాలో భూకంపాలు అనేవి సర్వసాధారణం. ఈ ఏడాది ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది.

ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా గట్టిగా జరిగింది. డజన్ల కొద్దీ భవనాలు కూలిపోయాయి. సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 100 మంది మరణించారు.

2008లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం 5,335 మంది పాఠశాల విద్యార్థులతో సహా 87,000 మందికి పైగా మరణించారు.