దర్శకుడు పరశురామ్‌కు మహేష్‌బాబు షాక్‌

0
400
mahesh babu

సినిమా అంటేనే అంత.. ఒక్కోసారి అనుకున్న ప్రాజెక్టులు పట్టాలు ఎక్కవు.. ఎవరూ ఊహించని ప్రాజెక్ట్‌లు బుల్లెట్‌ రైళ్లలా దూసుకు పోతుంటాయి. వీటిలో ఎన్ని విజయం అనే గమ్యం చేరతాయి అనేది పక్కన పెడితే, తమ ప్రాజెక్ట్‌ను పట్టాల మీద పరుగులు తీయించడానికి మేకర్స్‌ నానా తంటాలు పడుతుంటారు. మధ్యలో వచ్చే అవాంతరాలను దాటుకుని ముందుకు వెళ్లడం ఒక్కోసారి వారికి కత్తిమీద సాములా మారుతుంది. స్టార్‌ హీరో దయపై నడిచే చిత్ర పరిశ్రమలో సినిమాను ప్రారంభించడం కన్నా దాన్ని అనుకున్నట్లు పూర్తి చేయడమే కష్టం. ఇలాంటి కష్టంతో కుస్తీ పడుతున్నాడు దర్శకుడు పరుశురామ్‌.

గీతాగోవిందం సూపర్‌హిట్‌తో పరుశురామ్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌ డైరెక్టర్‌ స్టేటస్‌కు చేరిపోయారు. స్టార్‌ స్టేటస్‌ అయితే పెరిగింది కానీ.. స్టార్‌ హీరోలు సినిమా ఛాన్స్‌ మాత్రం ఇవ్వలేదు. గీత గోవిందం తర్వాత ఎక్కేమెట్టు, దిగే మెట్టూ అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి.

ఇంతలో అనుకోని వరంలా వచ్చింది మహేష్‌ సినిమా ఆఫర్‌. మైత్రి మూవీస్‌ సంస్థ మహేష్‌తో నిర్మించబోయే ‘సర్కారువారి పాట’ సినిమాకు పరశురామ్‌కు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే సమయంలో కరోనా వచ్చి మొత్తం ప్లాన్‌ పాడు చేసింది. ఈ సినిమాకు సంబంధించి అమెరికాలో ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. కరోనా కారణంగా అమెరికా షెడ్యూల్‌ క్యాన్సిల్‌ అయింది. నిన్న (డిసెంబర్‌ 30న) అమెరికాకు వెళ్లడానికి యూనిట్‌ ప్లాన్‌ చేసుకుంది. అయితే అమెరికాలో కరోనా సెకండ్‌వేవ్‌ భయపెడుతుండడంతో మళ్లీ ఆ షెడ్యూల్‌ వాయిదా పడిరది.

ఈ చిత్రంలో అమెరికా షెడ్యూల్‌పై పరశురామ్‌ భారీ ఆశలే పెట్టుకున్నాడు. విజువల్‌ వండర్‌గా షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకున్నాడట. అమెరికా కాకపోతే దుబాయ్‌లో అయినా చేద్దామని డిసైడ్‌ అయ్యాడు పరశురామ్‌. ఈ విషయమై మహేష్‌బాబుతో జరిగిన చర్చల్లో ‘‘ఏవండీ దుబాయ్‌లో అయితే కరోనా రాను అని మీకేమన్నా చెప్పిందా ఏమిటి?. అయినా భారీ స్థాయిలో యూనిట్‌ను తీసుకుని విదేశాలకు వెళ్లి రిస్క్‌ చేయడం దేనికి, రామోజీలో ప్లాన్‌ చేయండి కంఫర్ట్‌గా ఉంటుంది’’ అని మహేష్‌ చెప్పేశాడట.

దీంతో షాక్‌కు గురైన పరశురామ్‌ నిర్మాతలకు విషయం చెప్పగా, ఎలాగూ ఈ సినిమాకు సంబంధించి భారీగా బ్యాంక్‌ సెట్‌ను రామోజీలోనే వేశాం. విదేశీ షెడ్యూల్‌కు సంబంధించి సెట్స్‌, గ్రీన్‌మ్యాట్‌ షూట్‌ ప్లాన్‌ చేసుకుంటే బెటర్‌ అన్నారట. ఇక చేసేది లేక సినిమాకు సంబంధించిన మేజర్‌ వర్క్‌ అంతా రామోజీలోనే కంప్లీట్‌ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.