అలా కంటి చూపులో లోపం ఏర్పడిందా..? వెంటనే

0
508

డయాబెటిస్ (షుగర్) వ్యాధి గ్రస్తులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తాము తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకుంటే డయాబెటిస్ కొంచెం వరకూ అదుపులో ఉంటుంది. దీనికి తోడు వైద్యుల సలహాలు, సూచనలను తప్పక పాటించాలి. డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు రక్తంలో చెక్కర నిల్వలు పెరిగి ఆ ప్రభావం కంటి చూపుపై పడుతుంది. కావున కంటి చూపు విషయంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మధుమేహం (డయాబెటిస్) లక్షణాలు కొన్ని

డయాబెటిస్ (షుగర్ వ్యాధి) ప్రమాదకరమైనది. కానీ దీనికి మంచి మందులు ఉన్నాయి. వైద్యుల సూచనలు పాటిస్తే అదుపులోనే ఉంటుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారికి తరుచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, దీంతో దాహం పెరగడం, ఆకలి కూడా పెరుగుతుంటుంది. ఆదిలోనే చికిత్స తీసుకోకుండా శరీరంలోని పలు అవయవాలను పాడు చేస్తుంటుంది. రక్తంలో చెక్కర (షుగర్) స్థాయిలు పెరిగితే అది కంటి వరకూ వ్యాపించి పలు రకాల సమస్యలకు దారి తీస్తుంది.

వ్యాధికి గురవుతున్న సమయంలో కంటిలోని రెటీనా పలు మార్పులకు లోనవుతుంది. దీంతో చూపులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. డీఈడీ (DED) అనే కంటికి సంబంధించిన వ్యాధికి కూడా కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మందికి మధుమేహంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. మధుమేహ బాధితులు కంటి చూపును కోల్పోకుండా, తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

చూపులో మార్పును గమనించాలి

డయాబెటిస్ కు గురైనవారు, గురవుతున్న వారికి కంటి చూపులో చాలా తేడాలు కనిపిస్తాయి. చూపు మందగించడం, కళ్లు నొప్పులు, ఎర్రబడడం, కంటి వాపు, డబుల్ విజన్, స్ర్టేట్ గా చూడడంలో ఇబ్బందులు రావచ్చు. ఇవి కంటి చూపునకు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరికగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి సమస్యలు ఏర్పడితే వైద్యులను సంప్రదించాలని డయాబెటిస్ ఉన్న వారైతే వారి సూచనల మేరకు మందులు వాడాలని, లేని వారైతే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆహారం విషయంలో శ్రద్ధ అవసరం

మధుమేహ బాధితులు చెక్కర పరిణామాలను నియంత్రించుకోవాలి. తీసుకునే ఆహార పదార్థాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ఉపశమనం కలుగుతుంది. న్యూట్రీషన్ సలహాలు తీసుకోవడం ఉత్తమం. హై కేలరీ ఫుడ్, కార్బోహైడ్రేట్, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటితో రక్తంలో చెక్కర స్థాయిలు నియంత్రించబడి సాధారణ జీవితం గడుపవచ్చు. వైద్యుల సూచనల మేరకు తరుచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి. కళ్ల సమస్యలకు గురైన వారు తప్పనిసరిగా ధూమపానాన్ని మానేయాలి. ధూమపానం చేస్తున్న మధుమేహం వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువ సమస్యలు వస్తున్నట్లు కొన్ని అధ్యయనాలలో తేలింది.

రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవాలి

ఇక డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు అధిక రక్తపోటు (హైబీపీ) విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారంలో ఉప్ప, నూనె తక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటూ ఇబ్బందులు తగ్గుతాయి.